నవవిధభక్తులు.
శ్రీసాయినాథాయనమః. భగవద్గీతలో కర్మయోగము,భక్తియోగముమరియు జ్ఞానయోగముల ఆచరణద్వారా భక్తుడు భగవంతుని జేరగలడని శ్రీకృష్ణపరమాత్మ అర్జునునికి ప్రబోధించాడు. ప్రధమంగా యోగమనగానేమో పరిశీలించెదము. యోగమునకు ముందుగా వియోగమంటే ఏమిటో తెలిసికొందాము. వియోగమనగా విడిపోవుట లేక దూరమగుట మున్నగు అర్ధములు గలవు. ప్రస్తుత విషయమును ఆధ్యాత్మిక పరంగా గ్రహించుటకు ప్రయత్నించెదము. పరిపూర్ణ విశ్వచైతన్యము లేక పరమాత్మ నుండియే కోటానుకోట్ల జీవరాశులుగా ఈ సృష్టి ఆవిర్భవించినది. కావున ప్రతిప్రాణి జన్మకు ఆ పరమాత్ముని విశ్వచైతన్యమే కారణము. కాని భగవంతుని లీలేమోగాని ప్రతిజీవి తనమూలము మరచి వ్యక్తిగత అహంకారంతో జీవిస్తుంటాడు. అదే వియోగము, దుఃఖకారణము. ఆలా విడిపోయిన వ్యక్తి చైతన్యము విశ్వచైతన్యముతో ఐక్యమగుటయే యోగమనబడును. ఈ ఏకాత్మభావమును నిష్కామ కర్మల జేయుటవలనను , నిత్యానిత్య విచారణా పూర్వక జ్ఞానవిచారణలద్వారాగాని లేక విశ్వశక్తి మయమగు , పరమాత్మకు సర్వస్య శరణాగతినొంది భక్తిమార్గంలో జీవించుటవలనగాని పొందవచ్చును. అలాపొందబడిన ఫలమే మోక్షముగా మన శ్రుతులు వివరించాయి. ప్రస్తుత వ్యాసంలో భక్తిమార్గమును గూర్చి క్లుప్తంగా తెలిసికొనుటకు ప్రయత్నమ...