సాయికథలు - చంచల గుఱ్ఱము (Restless Mind.)
శ్రీసాయినాథాయనమః
సాయికథలు - చంచల గుఱ్ఱము
తేది 12-12-1909న సాయిబాబా ఓకథ చెప్పారు. " ఒకడికొక అందమైన గుఱ్ఱముండేది. వాడెంత శ్రమించినా అది జంట గుఱ్ఱంతో కలిసి పనిచేయలేదు. దానినెన్ని దేశాలు తిప్పినా ప్రయోజనం లేకపోయింది. ఎంత శిక్షణ నిచ్చినా అదిలొంగలేదు. చివరికొక పండితుడు దాని నెక్కడ నుంచి తెచ్చారో అక్కడికే తీసుకు పొమ్మని సూచించాడు. అలా చేయగానే ఆ గుఱ్ఱం సక్రమంగా పనిచేయ నారంభించింది. " ఖాపర్డే డైరివివరణ: అందమైన గుఱ్ఱమంటే వాసనలతో మదించిన మనస్సు. జంటగుఱ్ఱమంటే మంత్రమని చెప్పవచ్చు. యోగపరిభాషలో ప్రాణచలనమని చెప్పవచ్చు. దానితో కలసి మొదటి గుఱ్ఱం పనిచేయక పోవడమంటే నిరంతర మంత్ర జపంలో లయించక, పరిపరివిధాల పరుగులు పెట్టడమన్నమాట. లేక యోగ పరిభాషలో శ్వాసక్రియతో ఐక్యతచెందక పోవడమని చెప్పాలి! ఎన్ని సాధనమార్గాలూ దానికి ఉపకరించలేదు. ఒకపండితుడు - అంటే భగవద్గీతలో చెప్పినట్లు జ్ఞాని - చేసిన సూచన కర్ధం మనస్సును దాని పుట్టుక స్థానం మీద కేంద్రీకరించమని, 'మనస్సనేది ఏది? అదెక్కడ ఉదయిస్తుంది?' అని పరిశీలించడమన్నమాట. అలాచేస్తే మనస్సు లయిస్తుందని భగవాన్ రమణమహర్షి కూడ చెప్పారు. అట్టిసాధనలో స్థిరపడటమే గుఱ్ఱం లొంగి పనిచేయడమంటే. మనస్సు లొంగితే ప్రాణము కూడా లొంగుతుంది. కారణం ఆ రెంటికీ మూలమొక్కటే. అంటే ఉత్తమాధికారికి మనస్సు స్వస్థము కావడంవలన ప్రాణాచలనం దానికై అదే ప్రాణాయామాదులవసరం లేకనే కేవల కుంభకాన్ని పొందుతుంది. వాటి యజమాని పని నెరవేరుతుంది. శ్రీ సాయినాథ ప్రబోధామృతము , పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ
పైవివరణనుబట్టి మనస్సును స్వాధీనపరచుకొనుట యెంత కష్టమో తెలియగలదు. ఇలాంటి చంచల మనస్కుడొకడు బాబాను దర్శింప, బాబా వానికెలాంటి సందేశమిచ్చారో ఇపుడు పరిశీలించెదము.
బొంబాయిలో నుండు బాబా భక్తుడు కాకామహాజని యజమాని థక్కర్ ధరంశె జెథాభాయ్. కాకా తరచు శిరిడీ వెళ్లి అనేకదినములుండి వచ్చుట నెరిగి, కుతూహలముతో బాబాను పరీక్షించు ఆసక్తితో హోలీపండుగ సందర్భంలో శిరిడీ, కాకాతో మరియొకని తోడుతీసుకొని వెళ్ళాడు. కాకా బాబాకొరకు రెండు సేర్ల ఎండుద్రాక్షల కొన్నాడు. అవి గింజలతో కూడుకున్నవి. వారందరూ ద్వారకామాయి జేరుసమయమునకు బాబాసాహేబు తర్ఖడ్ యను వేరొకభక్తుడుండెను. సందేహమనస్కుడైన థక్కర్, బాబామహిమలగూర్చి తర్ఖడ్ ను ప్రశ్నింప, తానందులకు రాలేదని, భక్తుల మనోరథములు తప్పకనెరువేరునని యాతడు సమాధానమిచ్చెను. కాకతెచ్చిన ద్రాక్షలను బాబా అందరికీ పంచమన్నారు. థక్కరుకు కొన్ని ద్రాక్షలు దొరికాయి. గింజల ద్రాక్షలు తనకు ఇష్టములేకున్నను తిని గింజల తన కోటుజేబులోనే వేసుకొన్నాడు. గింజల ద్రాక్షలపట్ల తన అయిష్టత యోగియైన బాబాకు తెలియదా, మరేల తినమన్నారని తలచాడు. ఆతని యూహనెరిగిన బాబా తినమని మరిన్ని ద్రాక్షలిచ్చారు. కాని వీనిలో గింజలులేకుండుటచే థక్కరు మిగుల ఆశ్చర్య పడ్డాడు. అద్భుతముల చూడదలచు వానికై బాబా యీలీల చూపారు. గింజల ద్రాక్షలను, గింజలు లేనివానిగా మార్చివేశారు. ప్రక్కనున్న తర్ఖడ్ ను థక్కర్ ప్రశ్నింప, తనకు గింజలద్రాక్షలు దొరికాయని యాతడు చెప్పాడు. తన నమ్మకాన్ని దృఢపరచుటకొరకు, ఈసారి కాకానుండి ద్రాక్షలను అందరికి పంచాలని తలువ, బాబా యటులనే ఆజ్ఞాపించారు. ఈ నిదర్శనంతో థక్కరుకు బాబాపై నమ్మకం కుదిరి, తనమనోనిశ్చయముమరచి బాబాకు నమస్కరించాడు. అలానే ముందుగా తలువకనే, బాబాకు 15 రూపాయల దక్షిణ సమర్పించాడు. తనతో కాకానుకూడ తీసుకెళ్ల తలువ, బాబా యాతని యూహనెఱిగి యటులనే యనుమతించారు. ఈ సందర్భంలో బాబా వానికి కనువిప్పు కలిగేవిధంగా ఓ చక్కని సందేశాన్నిలా ఇచ్చారు.
" ఒక చంచలమనస్సుగల పెద్దమనుష్యుడుండెను. వానికి ఆరోగ్యము, ధనము పుష్కలముగా యున్నాయి. ఎలాంటి విచారములు లేకున్నను, అనవసరపు ఆరాటములతో అటునిటు దిరుగుచూ మనఃశాంతిని పోగొట్టుకొంటున్నాడు. మనసునకు నిలకడ లేకుండెను. ఆతని స్థితి కనిపెట్టి కనికరముతో, నీకిష్టము వచ్చినచోట నీనమ్మకము పాదుకొల్పుము. అటునిటు భ్రమింపక యొకేచోట యాశ్రయించుకొని నిలకడగా నుండు" మని చెప్పితిని.
ఈచక్కని బాబా సందేశం బాబాను పూర్తిగా నమ్మని మనుజులెల్లరకు వర్తిస్తుంది. బాబాకృప పొందుటకు వారిపై పరిపూర్ణ భక్తి విశ్వాసములుంచవలెను. మనుజులకు చిత్తచాంచల్యము సహజమైనను ప్రయత్నపూర్వక అభ్యాస వైరాగ్యములచే చంచల గుర్రంలాంటి మనస్సును స్వాధీనపరచుకోవచ్చును. పారాయణము, మననము, ధ్యానము ఇత్యాది సద్విషయములపట్ల శ్రద్ధ వహింపవలెను. బాబా తమగురువు పట్ల ఇలాంటి శ్రద్ధ, సహనములనుంచి గొప్ప మహిమాన్వితులైనారుగదా! వారనుసరించి చూపిన మార్గము మనకు సదా ఆచరణయోగ్యము! జనారణ్యంలో తన గుఱ్ఱాన్ని ( మనస్సును) పోగొట్టుకొన్న చాంద్ పాటిలు, బాబాకృపచే తిరిగి స్వాధీనపరచుకొన్నట్లు , మనంకూడా సాయికృపచే చంచల మనసులను ఆధీనంలోకి తెచ్చుకొని శాంతి, తృప్తుల పొందుటకొరకు ఆ సాయినాథుని హృదయపూర్వకంగా ప్రార్ధిస్తున్నాను!చంచల చిత్తము
చంచల చిత్తము తుర్రను తురగముబండిని గట్టగ బారని గుఱ్ఱము
ఏమి సేతురా రామా?
నేనేమి సేతురా రామా?
చంచల చిత్తమా? బారని గుర్రమా? ||2||
గురుని గుప్పిట పగ్గములుంచి
బండి నడపరా... ఓచిన్నా,
నీ బండి నడపరా ఓచిన్నా....
జీవన వనమున మర్కట మనసుర
గంతులు వేయగ, చిందులు ద్రొక్కగ
ఏమి సేతురా రామా?
నేనేమి సేతురా రామా?
మర్కట మనమా... చిందులు ద్రొక్కెనా? ||2||
గురుని రూపుపై చూపును నిలిపి
తిన్నగ సాగర ఓచిన్నా....
నీవు తిన్నగ సాగర ఓచిన్నా....
మాయలవలలో... మోహపు తెరలా
తనువు డస్సెను , మనసు చిక్కెను
ఏమి సేతురా రామా?
నేనేమి సేతురా రామా?
తనువు డస్సెనా మనసు చిక్కేనా? ||2||
గురుసన్నిధిని సర్వము మరచి
సాయిని నమ్మర ఓచిన్నా...
నీవు సాయిని నమ్మర ఓచిన్నా...
చీకటి జగములొ చింతల మనసుర
దారితప్పితీ ... నే దారితప్పితీ
ఏమి సేతురా రామా?
నేనేమి సేతురా రామా?
చీకటి జగమా దారి తప్పెనా? ||2||
సాయి ధ్యానపు దివ్వెలిగించి
దారిని చూడర ఒరన్నా....
నీవు దారిని చూడర ఒరన్నా....
చాంచల్యము మనసు నైజము , గురుని స్పర్శకి (ఆజ్ఞకు) అణగి యుంటుంది!
ReplyDelete