రామలాలతొ రామకృష్ణ !

శ్రీసాయినాథాయనమః

రామలాలతొ  రామకృష్ణ !
" మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము

పురాణాల్లో తరచుగా బాల శ్రీకృష్ణలీలలు  విన్నాము కాని బాల శ్రీరాముని లీలలు అంతగా వినలేదనడం సత్యవాక్యం. ప్రస్తుతం శ్రీరామకృష్ణ పరమహంస బాల శ్రీరామునితోటి ఆశ్చర్యకర అనుభవముల  తెలుసుకొనెదము. 


 శ్రీరామకృష్ణ పరమహంస సాధనా అవస్థలో వేరు వేరు సమయాల  వివిధ విద్వాంసులు, సన్యాసులు, మంత్రోపాసకులు,  గురువులు  వారిని దర్శించడమేగాక వారి పరమహంసస్థితి ప్రాప్తికి తమతమ పాత్రల నిర్వహించారు. జఠాధారి యను రామాయత్ శాఖకు సంబంధించిన శ్రీరామభక్త సన్యాసి 1864వ సంవత్సరంలో దక్షిణేశ్వర్ కు వచ్చాడు. అతడు శ్రీరామకృష్ణునకు   రామ మంత్రోపదేశము జేసినాడు. అంతేగాక రామలాల ( బాల శ్రీరాముని) చిన్నవిగ్రహాన్నికూడా బహూకరించాడు, ఆవివరాలనిపుడు శ్రీరామకృష్ణుల వారి మాటలలోనే  పరిశీలించెదము. " ఆ బాబాజీ (జటాధారి) రామలాల విగ్రహాన్నెన్నో యేండ్లు పూజించాడు. తాను వెళ్లిన ప్రదేశాలకు తనతోపాటే తనదైవ ప్రతిమను తీసుకెళ్ళేవాడు. తాను పొందిన భిక్షతోడనే వంటజేసి నైవేద్యము సమర్పించెడివాడు. అంతియేగాక నైవేద్యమును రామలాల తినుటను, మరింత కోరుటను, మరిన్ని బాల్య చేష్టలను  స్వయంగా  తిలకించాడు. రామలాల సేవలో జటాధారి తననుతానుమరచి ఆనందభరితుడయ్యెడివాడు. నేనుకూడా జటాధారితో రామలాల చేయుపనులను ఓ రోజల్లా వీక్షించాను. రోజులు గడచే కొలది రామలాలకు నాపై ప్రేమ వృద్ధిచెందుట గమనించాను.  నేను జటాధారి చెంతనున్నపుడు రామలాల మిగుల సంబరంతో ఆడిపాడెడివాడు. కాని నేను  నాగదికి వెళ్ళుసమయాన నాతోపాటే పరుగు దీసెడివాడు. నాతొ రావలదని వారించినప్పటికీ జటాధారుని చెంత కెళ్ళేవాడుగాదు. వీనిచేష్టలు  చాల వింతగా దోచేవి. అంతటి  భక్తిశ్రద్ధలతో  కొలిచిన జటాధారిని వీడి  నాపై ప్రేమపెంచుకోవడం నాకు అర్ధంకాని విషయము. ఇదంతయు భ్రమకాదు సుమీ! నేను నిజంగా వాని జూసేవాడిని. కొన్నిసార్లు నాముందు నాట్యంజేసేవాడు, కొన్నిసార్లు నన్నువెంబడించెడివాడు, కొన్నిసార్లు నా ఒడిలో కూర్చొనుటకు మారాం జేసేవాడు. అలాయని దగ్గరకు దీయుటకు ప్రయత్నిస్తే బయట ఎండలోకి పరుగెత్తి తోటలోని పూల గోసెడివాడు లేక సమీప గంగానదిలో జలకాలాటలతో ఈదులాడెడివాడు. ఎండలో నడవకు, కాళ్ళు బొబ్బలెత్తుతాయి , జలుబుజేస్తుంది , జ్వరమొస్తుందని  వారించినా యేమాత్రం లెక్కజేసెడివాడుకాదు. వాని అల్లరిపనుల నాపడు. కొన్నిసార్లు తనపెద్ద అందమైన  కనులతో నావంకజూచి  మధురంగా నవ్వెడివాడు, మరొక్కసారి కోతిమొహం పెట్టి వెక్కిరించేవాడు. నిజానికి నాకు చాల కోపమొచ్చేది, భడవా! నేడు నీ భరతం పడతా, వెముకల విరుస్తా చూడు అంటూ మిగుల తిట్టేవాడిని. నీళ్ళనుండి, ఎండనుండి లోనికివచ్చి యాడుటకు  యేదైనా బహుమతితో ప్రేరేపించేవాడిని. మాటవినక మరీ అల్లరెక్కువైతే అటూయిటూ రెండు చెంపల వాయించే వాడిని. అలాంటపుడు బిక్కమొగంతో కన్నీళ్లు పెట్టేవాడు. అపుడు మిగులబాధతో వానిని వడిదీసి బుజ్జగించేవాడను. ఈవిషయాలన్నీ వాస్తవంగా జరిగాయి. ఓరోజు గంగాస్నానానికి వెళ్ళేటపుడు నన్ను వెంబడించాడు.  నేనేం చేయగలను? నాతోపాటే తీసికెళ్ళా. కానీ యెంతసేపటికీ నీళ్ళనుండి బయటకురాడే! బ్రతిమాలినా వినడే! చివరకు కోపమొచ్చి, అలాగేలే,  నీళ్లలో యెంతసేపుంటావో చూస్తాననుచు వాని నీటముంచాను. ఊపిరాడక నీటిలో  రామలాల విలవిల్లాడుచున్నాడు.  నేనీ  దృశ్యం చూడలేక ' నేనేం జేస్తున్నా' నంటూ మిగుల బాధపడ్డాను.    నీటినుండి బయటకుదీసి రెండుచేతుల ఎత్తుకొన్నాను. ఈఘటన నన్నెంత బాధించినదో వర్ణించలేను, పెద్దగా యేడ్చేసాను. ఆపై కొద్దిసేపటికి  తినుటకేమైనా పెట్టమని రామలాల మరీమరీ అడగనారంభించాడు. కాని యిచ్చుటకు ముతక దంపుడు అటుకులు తప్ప మరేమీ నావద్ద  లేవు.  అవేపెట్టాను. అలా తినునపుడు వాని సుకుమార మృదువైన పెదాలు, నాలుక  మిగుల చీరుకు పోయాయి.  నేనెంతోబాధతో వాని వడిలోకి దీసికొని, ' తల్లి కౌసల్య  నీకెంతో శ్రద్ధతో వెన్న మీగడల తినిపించెడిది, కాని  నిర్దయుడనై నేనీ ఆహారాన్ని తినుపిస్తున్నాను. ' "  ఈఘటనజరిగిన కొంతకాలానికి తరువాత  రామకృష్ణులు వారి శిష్యులకీవివరాలు చెబుతూ బిగ్గరగా  రోదించారు.
రామకృష్ణులు తమ స్మృతుల కొనసాగించారు, "  కొన్నిసమయాల  జటాధారి వంటజేసి రామలాలాకై జూచెడివాడు.  కనుపింపకపోవుటచే వెదకుచూ నాగదికొచ్చి ఆటలాడెడి బాలుని జూచి కోపంతో యూగిపోయేవాడు. ' ఎంతోశ్రమపడి నీకోసమీ భోజనం సిద్ధంజేసాను, నీకై అంతా వెదికాను , మరిక్కడా రోజల్లా నీవుండేది?  నేనంటే నీకు లెక్కలేదు.  చేసినదంతా  మరచిపోయావు. ఎపుడూ నీవంతేలే, తోచింది జేస్తావు. నీకు దయగాని, ప్రేమగాని లేవు. తల్లిదండ్రుల వీడి అడవులకెళ్ళావు. గుండెపగిలి పాపం నీతండ్రి మరణించాడు. చనిపోయే ఆ చివరి క్షణాలలోకూడ తండ్రిని జూడ నీవురాలేదు. '  అంటూ యిలా  యేమేమో మాట్లాడుచూ  రామలాలాను తనగదికీడ్చికెళ్లి భోజనం పెట్టేవాడు.  ననువీడిరామలాల  వానితో వెళ్లకపోవుటచే  యెంతోకాలం జటాధారి దక్షిణేశ్వరములో కొనసాగాడు. అంతకాలం.  అంతగా ప్రేమించిన బాలునివదలి వెళ్ళుట జటాధారి కసాధ్యవిషయము. అనుకోనివిధముగా  ఓరోజు  జటాధారి నావద్దకొచ్చి మిక్కిలి సంతోషంతో యిట్లన్నాడు, '  నేను  మున్నెన్నడూ యెరుగనివిధముగా,  ఎల్లవేళలా కోరుకొన్న   నిజస్వరూపాన్ని రామలాల  నాకు చూపాడు. నాజీవితము ధన్యమైనది. ఈస్థలం వదలి వెళ్లనంటున్నాడు, నిన్నువదలడట. కాని  నేనీవిషయమై యేమాత్రము బాధపడను. నీతో సంతోషంతో కాలం గడుపుతాడు, ఆనందంతో ఆడుకొంటాడు. ఈవిధంగాజూస్తూ నేనెంతో పొంగిపోతాను. వానిసంతోషమే   నా సంతోషము. కావున నీకు వీని నప్పగిస్తూ సెలవు దీసుకొంటాను. నీతో సంతోషంగా కొనసాగే బాలునిదలచి మిగుల ఆనందిస్తాను. '  అంటూ జటాధారి నాకీ రామలాల విగ్రహాన్నప్పగించి వెళ్ళిపోయాడు. అప్పటినుండి రామలాల నాచెంతనే కొనసాగాడు. "  అంటూ శ్రీరామకృష్ణ పరమహంస ముగించారు.

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి! 








Comments

  1. బొమ్మకాదు వాడు లీలల బాల శ్రీరాముడు చూడు !

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)