సాయి కథలు - ఏడురోజులలొ ముక్తి !

శ్రీసాయినాథాయనమః

సాయి కథలు - ఏడురోజులలొ ముక్తి !

ఏడురోజులలోనే ముక్తి, ఇది సాధ్యమా యని తలచువారికి మనపురాణాల్లో జెప్పబడిన  ఓ ప్రసిద్ధ ఘటనను పెద్దలు చెబుతుంటారు.  అభిమన్యుని పుత్రుడు పరీక్షిత్తు మహరాజు  మునిబాలుని శాపానికి గురై కేవలం మరొక్క ఏడురోజులలోనే మరణిస్తానని గ్రహిస్తాడు. అంత తక్కువ వ్యవధిలో  తానుముక్తి పొందుటకు భాగవత శ్రావణమే అతి సమీప మార్గముగా తెలిసికొని , వ్యాసమహర్షి పుత్రుడైన బ్రహ్మజ్ఞాని శుకమహర్షి ద్వారా ఆ పవిత్ర గ్రంథ శ్రవణాన్ని మిగుల భక్తి శ్రధ్ధలతోడను, తీవ్ర వ్యాకులతోను ఏడురోజుల్లో పూర్తిజేసి ముక్తిని పొందుతాడు. ఆయన శ్రవణము గొప్ప తపస్సులా కొనసాగింది.

పై సంఘటనను పోలిన కథయొకటి శ్రీ సాయి  సచ్చరిత్రము 18-19 అధ్యాయములలో చూస్తాము. సాఠేయనునతడు మిక్కిలి పలుకుబడి కలిగియున్న వ్యక్తి. జీవితంలో ఒడిదుడుకులు సహజం, కాలాంతరంలో యతడు వ్యాపారంలో మిగుల నష్టాన్ని పొందుతాడు. దానికితోడు మరిన్ని చికాకులు, సమస్యలు చుట్టుముట్టుటచే తీవ్రమనోవ్యాకులతకు గురియై విరక్తి చెందుతాడు. ఆ సమయంలో సాఠే తన స్నేహితుని ద్వారా సాయి బాబాను గూర్చి వింటాడు. తన సమస్యల పరిష్కారానికి,  శిరిడీ వెళ్లి సాయిని  దర్శించి  వారిసాన్నిధ్యంలో మిగుల శాంతిని పొందుతాడు. అతడు గొప్ప మనోబలము, పట్టుదలగలవాడగుటచే వెంటనే గురుచరిత్ర పారాయణము మొదలుపెట్టి 7 రోజులలో గ్రంథపఠనం పూర్తిజేస్తాడు. పారాయణ పూర్తికాగానే యానాటి రాత్రి బాబా వానికి స్వప్నదర్శనమిచ్చి వానికి గురుచరిత్రను గూర్చి బోధజేయునటుల కన్పిస్తాడు. ఆ కలద్వారా బాబా ఏ సందేశమిసున్నారో తెలియగోరి దీక్షితుద్వారా బాబానడిగి;  మరొక సప్తాహ పారాయణం కొనసాగించాలని దానిద్వారా యతనికి మిగుల లాభం కలుగునని  గ్రహిస్తాడు. అదేసమయంలో బాబాను సేవిస్తున్న హేమాడ్ పంతు సాయి  సాఠేకి చెప్పిన సందేశ సంభాషణ విని మిగుల అసూయ చెందుతాడు. తాను ఏడు సంవత్సరములనుండి సేవించినా సాయి ఎన్నడూ తనకెలాంటి సందేశమివ్వలేదని, కేవలం ఏడు రోజుల్లోనే  సాఠే సాయికృపకు పాత్రుడైనాడని వొకింత వికలమనస్కుడౌతాడు. వాని భావాన్ని గ్రహించిన సర్వజ్ఞుడు సాయి యతనిని శ్యామావద్దకు పంపి తగు సమాధానం అందిస్తాడు. ఇచట మనం ముఖ్యంగా గమనింపవలసినదేమంటే, కేవలం యేడు రోజుల తీవ్ర భక్తి భావంతో  సాఠే  కలలో సాయిని  జూసి, వారి కరుణకు పాత్రుడౌతాడు. అలాంటి తీవ్ర భక్తి,  వైరాగ్యములు లేని హేమాడ్ పంతు ఏడు సంవత్సరములు సేవించినా ఎలాంటి యనుభవాన్ని పొందలేక పోతాడు.

ఈవిషయాన్నే ధ్రువపరచే  ఓ భక్తురాలి యనుభవాన్ని " శ్రీసాయి సచ్చరిత్ర పారాయణ మహిమ,  ఓభక్తురాలి అనుభవము. " 
( www.saileelatelugu.blogspot.com dated October 17,2018 ) లో చూడగలరు.   బాబానుగూర్చి పెద్దగా వినని, తెలియని ఓ మహిళ  కేవలం మూడురోజుల్లోనే ( సాధారణముగా ఏడు రోజులపాటు చేయు )  శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణము ముగించి  తన ఆర్ధిక సమస్యలనుండి  బయటపడి ఆపై సాయిభక్తురాలిగా మారినది. పైన పేర్కొన్న భక్తుల యనుభవాలనుండి ఓ విషయం బోధపడుతోంది. శ్రీరామకృష్ణ పరమహంస పేర్కొన్నటుల  దైవ కృప పొందుటకు యెంతో భక్తి, మరెంతో తీవ్ర వ్యాకులత యావశ్యకము!

శ్రీసాయికరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి !





Comments

  1. భగవంతునికొరకు తీవ్రవ్యాకులత, భక్తిశ్రద్ధలు దైవకృపాకటాక్షాలకు, ముక్తిప్రాప్తికి సమీప మార్గములు !

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)