శ్రీరామకృష్ణ పరమహంస జయంతి.

శ్రీసాయినాథాయనమః, శ్రీరామకృష్ణాయనమః !

1836 - 1886

నేడు శ్రీరామకృష్ణ పరమహంస 185వ  పవిత్ర జయంతి.

" మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము
శ్రీరామకృష్ణ పరమహంస మహాద్భుత  జన్మ వృత్తాంతము. 

అవతారపురుషుల జన్మము అద్భుతము, వారి కర్మలు అద్భుతము, వారి జీవనసరళి అత్యత్భుతము. ఈసత్యమును  శ్రీకృష్ణుని, గౌతమబుద్ధుని, ఆదిశంకరాచార్య,  చైతన్య మహాప్రభు, శిరిడీ సాయిబాబా, రామకృష్ణ పరమహంస  మున్నగు మహాపురుషుల జీవితములు పరిశీలించిన చూడగలము. గదాధరుని ( శ్రీరామకృష్ణ పరమహంస) శేషఅవతారకార్యమును కొనసాగించుటకుగాను తాము మరల ప్రాణముపొందితిమని 1886వ సంవత్సరములో మూడురోజుల సమాధియనంతరము సాయిబాబా భక్తులకు చెప్పియున్నారు. అనగా వీరిరువురి అవతారకార్యములు  ముడివడియున్నటుల గ్రహింపవచ్చును.   ఈమహనీయులిద్దరు యితర అవతారపురుషులవలె కారణజన్ములు, కేవలము లోకకళ్యాణమునకై మానుషవేషధారులై ప్రభవించారు. ప్రస్తుతవ్యాసంలో శ్రీరామకృష్ణుల జన్మవృత్తాంతమును క్లుప్తంగా పరిశీలించెదము.  శ్రీరామకృష్ణ పరమహంస బాల్యనామము గదాధరుడు. ఆతని తండ్రిపేరు క్షుదీరామ్ చటోపాధ్యాయ్ . పశ్చిమబెంగాల్ లోని కామార్పుకూరు వారి స్వగ్రామం.   క్షుదీరామ్ 1935వ సంవత్సరంలో తీర్థయాత్రలకు బయలుదేరాడు. మొదటగా కాశీవిశ్వేశ్వరుని దర్శించి ఆపై పితృదేవతలకు శ్రాద్ధకర్మలు నిర్వహించుటకై గయవెళ్ళాడు. గయలో ఓ మాసం నివసించి గతించిన తమవంశ పెద్దలకు శాస్త్రవిధిప్రకారం  శ్రాద్ధకర్మలు నిర్వహించాడు. చివరిగా యచటి విష్ణుదేవాలయంలో గదాధరునకు ( విష్ణుమూర్తికి) పిండప్రదానం చేశాడు. ఆయాసేవలనంతరం  క్షుదీరామ్ యెంతో తృప్తిశాంతులపొందాడు. ఇలా వుండగా ఓరాత్రి గయలో ఆతనికొక దివ్యస్వప్నదర్శనమయింది. ఆ కలలో దేవాలయంలోని పవిత్ర విష్ణు పాదములచెంత తనపూర్వీకులకు మరల పిండప్రదానం చేస్తున్నాడు. మిగుల ప్రకాశవంతమైన దేవతారూపుదాల్చిన వారి పెద్దలను చూశాడు,  వారెంతో సంతోషంతో సేవలంగీకరించి వాని దీవిస్తున్నారు. క్షుదీరామ్ భక్తిశ్రద్ధల మిగుల పారవశ్యముపొంది వారిపాదముల  ప్రణమిల్లాడు. మరుక్షణంలో దేవాలయమంతా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఓ సుందర సింహాసనంపై మిగుల కాంతిమయదేహంతో ప్రకాశించే సుందర దేవతామూర్తి కూర్చొనియున్నాడు, వాని కిరువైపుల తమపూర్వీకులు చేతులుమోడ్చి  మిగులవినయపూర్వకంగా నిలబడియున్నారు. ఆసనమధిష్ఠించిన దేవతామూర్తి ప్రసన్నవదనంతో మిగుల పేమతో ,  క్షుదీరాముని దగ్గరకుపిలిచాడు. యాంత్రికంగా క్షుదీరామ్ దేవతామూర్తిని సమీపించి అపరిమిత భక్తిశ్రద్ధలతో ప్రణమిల్లి వేనోళ్ళ స్తుతించాడు. మృదుమధుర స్వరంతో ఆ దైవరూపుడిలా అ న్నాడు, "  క్షుదీరామ్, నీ భక్తిశ్రద్ధ సేవలకు నేనెంతో ప్రసన్నుడనయ్యాను. నేనే స్వయంగా నీపుత్రునిగా అవతరించి కుటీరంలో నీవందించే సేవలందుకొంటాను."  క్షుదీరామ్ సంతోష సంభ్రమాశ్చర్యాలకంతులేకున్నది. మరుక్షణంలో తానతిసామాన్యుడననియు, ఆదేవతామూర్తిని సేవించే అర్హత తనకులేదని విన్నవించుకున్నాడు. దేవతామూర్తి వాని వినయవిధేయతలకు మిగుల సంతసించి  అభయవాక్యాలనిలా  పలికారు, "  భయపడకు క్షుదీరామ్, నీ వర్పించగలదేమాత్రమైనను నేను స్వీకరిస్తాను, కావున నాకోరికకెలాంటి అభ్యంతరం చెప్పకు! " .  ఈమాటలు విన్న క్షుదీరామ్ కు నోటమాటరాదు, సంతోషంతో దుంఖంతో మిళితమైన భావోద్రేకాలు వానిని కమ్మేసాయి. బాహ్యస్పృహ కోల్పోయాడు. ఆ క్షణంలోనే వాని కల చెదిరింది. మెలకువ వచ్చినపిమ్మకూడా యాతని పారవశ్యం యెంతోసేపు కొనసాగినది, క్రమంగా బాహ్య స్పృహపొందాడు. దైవస్వప్నమెప్పటికీ వృధాకాదు, ఓ దైవరూపుడు తమయింట జన్మించబోతున్నాడనే విశ్వాసం వాని మనసునింపింది.
అప్పుడు క్షుదీరామ్ వయసు 60 సంవత్సరాలు. ఈదివ్యస్వప్న వివరాల నతడు  యెవరికి చెప్పలేదు, వాస్తవరూపు దాల్చేవరకు గోప్యంగా యుంచాడు. ఆపై గయనుండి వెనుదిరిగి ఏప్రిల్ 1835 లో తనస్వగ్రామం కామార్పుకూరు చేరుకొన్నాడు. ఈమధ్యకాలంలో క్షుదీరామ్ భార్య చంద్రాదేవికి యెన్నో దివ్యస్వప్నాలు, ఆశ్చర్యకర దర్శనాలు కలిగాయి.  ఒకరోజు తన యింటికి సమీప శివాలయమునకెళ్లినది. అందలి శివలింగమునుండి మహత్తర తేజోపుంజము వెల్వడి ఆమె గర్భమున ప్రవేశించినది. ( విష్ణుసహస్రనామంలో విష్ణుమూర్తిని శంభునిగా అనగా శివునిగా స్థుతింపబడినది, అనగా  శివకేశవులు ఒక్కరే! ).  గర్భవతినను భావమామె కేర్పడినది. గయనుండి యింటికి జేరిన భర్తతో  తన యనుభవముల పంచుకొంది. ఆమెలో వింత తేజసును భర్త క్షుదీరామ్ గమనించాడు. గర్భం ధరించిన యప్పటి ఆమె  వయసు 45 సంవత్సరాలు. భార్యాభర్తలు తమ దివ్యానుభవాలను   లోకానికెల్లడించక రహస్యంగా దాచారు. ఫిబ్రవరి 18, 1936 సూర్యోదయానికి  పన్నెండు నిముషాలముందు పండంటి మగబిడ్డకు చంద్రాదేవి జన్మనిచ్చినది. అతడే గదాధరుడు, అతడే ఆపైకాలంలో రామకృష్ణ పరమహంసగా లోకపూజ్యుడైన స్వామివివేకానందుని  గురువు.

Ref : Sri Ramakrishna And His Divine Play  by Swami Saradananda, Swami Chetanananda

శ్రీసాయి కరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!
 శ్రీరామకృష్ణ పరమహంస దివ్యాశీసులు పాఠక మహాశయులకెల్లరకు లభించుగాక! 






Comments

  1. అవతారపురుషుల జన్మలు అత్యద్భుతములు, ఆశ్చ్యర్యకరములు !

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)