శ్రీ సాయిరాముడు !

శ్రీసాయినాథాయనమః 

పాఠక సాయిభక్తులెల్లరకు శ్రీరామనవమి శుభాకాంక్షలు! 
"  వేదపురాణాది సద్గ్రంధములు చదువునప్పుడు నా సద్గురువైన సాయిబాబాయే శ్రీరాముడుగా, శ్రీకృష్ణుడుగా  తోచును. "  శ్రీసాయిసచ్చరిత్ర రచయిత హేమాద్రిపంతు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రాక్షససంహారం జేసి మానవాళినుద్ధరించినవిధముగా  కలియుగ సద్గురు శ్రీ సాయిరాముడు కరోనామహమ్మారీ  రాక్షసవ్యాధి పీచమణచి ప్రపంచజనావళిని కాపాడుటకై ప్రార్ధించెదము!
సాయి కథలు - శ్రీ సాయి రాముడు !
" మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము

సాయిభక్తులు పెక్కుమంది సాయిబాబాను సాయిరామునిగా భావించి పూజిస్తారు. దీనికి ముఖ్యకారణము సద్గురుసాయినాథుడు   అవతారపురుషుడు శ్రీరామచంద్రుడు  వేరుకారని విశ్వసించడమే. ఈభక్తుల విశ్వాసానికి అనేక ఆధారాలను చూడగలము. శిరిడీలో జరుగు ముఖ్యవేడుకలలో శ్రీరామనవమి ఒక్కటి, ఆవేడుకలు జరుపుకొనుటకు సాయిబాబ  సంపూర్ణయనుమతి నిచ్చారు. ప్రప్రధమంగా రామనవమివేడుక 1912వ సంవత్సరంలో జరిగినది.  అదేరోజున ముస్లింలు జరుపుకొను ఉర్సు మరియు చందనోత్సవములకు అప్పటికి కొన్ని సంవత్సరములముందునుండియే శిరిడీలో  బాబాయనుమతితో జరుపబడుచున్నవి. హిందూముస్లిం ఐక్యతకై బాబా అలాచేశారనేది భక్తుల నమ్మిక. ద్వారకామాయిగ పిలువబడు పాతమజీదు సాయిబాబా జేరునప్పటికే సమీపమున హనుమదేవాలయముండుట రామునికి ముందుగనే హనుమ ఆప్రదేశము జేరెననెడి  భక్తులయోచన ఆలోచింపదగిన సత్యము. అంతియేగాక సాయి, తమ భక్తులకు శ్రీరామచంద్రునిగా దర్శనమిచ్చిన  సందర్భములను శ్రీసాయిసచ్చరిత్రములో చూడవచ్చును. శ్రీరాముని పూజించెడి ఓ డాక్టరు తనస్నేహితుడగు మమల్తదారుతో శిరిడీవెళ్లి యచట ద్వారకామాయిలో సాయి స్థానంలో శ్రీరామునిజూచి బాబాను అవతారపురుషునిగా యనుభవము పొందాడు. మరొక్క సంఘటన పరిశీలిద్దాము. తమ కాశీయాత్ర మార్గంలో బాబాను దర్శింప మదరాసు భక్తసమాజమండలి ద్వారకామాయి వచ్చి చక్కటిభజనజేశారు. యజమాని భార్య శ్రీరాముని భక్తురాలు, అపుడపుడు శ్రీరామదర్శనము పొందుచుండెడిది. మధ్యాన్న ఆరతి సమయమున సాయిబాబా ఆమె భక్తివిశ్వాసాలకు మిగుల ప్రసన్నులై శ్రీరామచంద్రునిగా దర్శనమిచ్చారు. శ్రీమతి ఖాపర్డే భార్య శిరిడీలో షుమారు ఏడుమాసములు సాయిని మిగుల భక్తిశ్రద్ధలతో  సేవించినది. ఓరోజు  మధ్యాన్న సమయాన ఆమెతెచ్చిన భోజనమును సాయి మిగుల ప్రేమతొ భుజించారు. ఆపై ఆమె బాబా కాళ్ళను భక్తితో  తోముట ప్రారంభించినది.  ప్రతిగా, తోముచున్న ఆమె చేతులను బాబా తోముట ప్రారంభించారు. గురుశిష్యుల ప్రేమకు సమీపమునయున్న భక్తుడు శ్యామా మిగుల ఆశ్చర్యపడ్డాడు. ఆమె యదార్ధమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువయిన యాకర్షించు కంఠముతో ' రాజరామ్ ' యనుమంత్రమును ఎల్లప్పుడు జపించమనియు, అట్లు చేయుటచే ఆమె జీవితాశయము నెరవేరునని, మనసు మిగుల ప్రశాంతమగునని చెప్పారు. అది శక్తిపాతము, బాబా భక్తురాలికి శక్తిప్రసాదించారు. బాబా చెప్పిన మాటలు మంత్రాల్లా ఆమె హృదయంలో స్థిరపడ్డాయి. శిరిడీలోని సాయిబాబా,  అయోధ్య  శ్రీరామచంద్రుడు వేరుకారని విశ్వసిస్తూ వారి దివ్యాశీసులకై హృదయపూర్వకంగా ప్రార్ధించెదముగాక!

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి! 

శ్రీరామనామశక్తి !

Comments

  1. శ్రీకోదండరాముడు, శ్రీ సాయిరాముడు ఒక్కరే, దివ్యశక్తి సంభూతులు! వారిరక్షణ మానవాళికి సదా లభించుగాక!!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)