Posts

Showing posts from March, 2026

శ్రీసాయిసందేశామృతము 51 (Nectar of Sri Sai's message 51)

Image
శ్రీసాయినాథాయనమః ! సమర్థ సద్గురుసాయినాథులు సర్వజ్ఞులు , సర్వవ్యాపకులు , సర్వశక్తిమంతులు , కరుణాంతరంగులు , భక్తరక్షణ దీక్షావ్రతులు . వారినే స్మరిస్తూ శరణుపొందినచొ మనకోర్కెలెల్లదీర్చి తుదకు కోర్కెలేలేని మోక్షమును ప్రసాదింతురు . నిత్యసాయిసచ్చరిత్ర పారాయణమందులకెంతో ప్రయోజనకారి, ఏలన మననిత్యకృత్యములలోని ప్రతిపనికి అందు సమాధానము దొరుకుతుంది . బాబా తమకు తమఫోటోకు తేడాలేదనే యనుభవాన్ని భక్తులకు ప్రసాదించారుగావున మన ఇంట్లోని బాబా చిత్రపటం బాబాతో సమానంగా భావించి తదనుగూనంగా మన ప్రవర్తనను సరిదిద్దుకోవాలి . ఇంట్లోని పెద్దలా, సాయి చూస్తున్నారు , వింటున్నారు నినాదాన్ని సదా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా వ్యవహరించాలి . మనసాధక బాధకాలు సాయికి తెలిసినా అపుడపుడు మనసువిప్పి ఆయనకు సమస్యలను విన్నవించుకోవాలి . తల్లి తండ్రి గురువు దైవం సర్వం సాయే యను భావన మిగుల ప్రయోజనకారి . అలాంటిసమయాల్లో సాయి ఏదోరూపంలో సాయమందిస్తారు . శ్రీసాయిసచ్చరిత్ర శ్రవణ పఠనాదులు కేవలం పర్వదినాలలోనేగాక అనునిత్యం జరగాలి . లేకుంటే మాయకమ్మేసి మనలనజ్ఞానంలోకి తోసివేస్తుంది, అద్దంపై ధూళిలా అంతరంగంపై మాయపొర ఏర్పడుతుంది. చరిత్రపారాయణ యనే శుద్ధవస్...

శ్రీసాయిసందేశామృతము 50 (Nectar of Sri Sai's message 50)

Image
శ్రీసాయినాథాయనమః ! సాయికథలు చెప్పువారు , వినువారు ధన్యులు . ఇవిమాములు కథలుగావు , భక్తుల అంతరంగ అనుభవముల సంపుటములు . ప్రతికథవెనుక ఓ హితముగూర్చెడి సందేశము , బాబాకరుణావీక్షణ రక్షణాలు మిళితమై వుంటాయి.ప్రస్తుత అంతిమ అధ్యాయములో బాబా పరిపూర్ణ యనుగ్రహముపొందిన భక్తుల యనుభవములు చెప్పబడినవి . కాకాసాహెబు దీక్షితు మహారాష్ట్రలోని ఖండ్వా గ్రామమందు బ్రాహ్మణకుటుంబమున జన్మించాడు . వృత్తిపరంగా న్యాయవాది . మిత్రుడు నానాసాహెబ్ చాందోర్కర్ ద్వారా సాయిబాబా ఘనతవిని మిగుల ఆకర్షితుడై తనకాలి కుంటితనంకంటే మనసుకుంటితనాన్ని పోగొట్టుకొనుటకై సాయిని దర్శింపదలచాడు . కేవలం సంకల్పించడమే దీక్షితు వంతు , అదికూడా బాబా సంకల్పమేమోగదా ? ఆపై అహమ్మదాబాద్ లో శ్యామాను కలవడం, ,మేఘాయొక్క బాబాచిత్రపట దర్శనం , క్రిక్కిరిసి రైలులో మిత్రుడు గార్డుగా ఉండటం, కోపర్గామ్ లో రైలుదిగగానే నానాసాహెబ్ ను కలవడం ,గోదావరిలో స్నానముజేసి శిరిడీ జేరడం మున్నగు సంఘటనలు సాయి సమకూర్చిన సదుపాయాలుగావా ? సాయి ప్రదమదర్శనంలోనే పరమానందాన్నిపొందాడు దీక్షితు . ఈ కలయిక 1909వ సంవత్సరములో జరిగినది . పిదప అచిరకాలంలోనే శిరిడీలో నివసించుటకై దీక్షితు వాడ నిర్మించాడు ....

శ్రీసాయిసందేశామృతము 49 (Nectar of Sri Sai's message 49)

Image
శ్రీసాయినాథాయనమః ! సాయిబాబా సమర్ధసద్గురువు . తమను పరీక్షింపవచ్చిన అవిశ్వాసభక్తులకు అనుభవములకలిగించి వారిలో విశ్వాసం నింపేవారు . ఈఅధ్యాయంలో బాబాను పరీక్షింపవచ్చిన ఇరువురి భక్తులయనుభవాలు ప్రస్తావించబడ్డాయి . మొదటివ్యక్తి బొంబాయికి చెందిన హరి కానోబా బాబాపై నమ్మకం లేనివాడు . స్నేహితులతో కలసి కొత్తచెప్పులు ధరించి జరీ తలపాగాతో ద్వారకామాయికి జేరాడు . బాబాను దర్శించినపిమ్మట యాతనికి వెలుపల మూలన విడిచిన చెప్పులు కనబడకపోవుటచే మిగుల కలవరపడ్డాడు . వాడికి వెళ్ళిభోంచేసినా చెప్పులగురించే వానిచింత. అంతలో ఆశ్చర్యంగా ఓ బాలుడు పోయిన వానిచెప్పులను కర్రకు వేలాడగట్టి " హరీకా బేటా , జారీకా పేటా " యంటూ అరుస్తూ, తనను బాబాపంపారని ఎవరు హరికా బేటాయో, ఎవరు కొత్తజరీపాగా ధరించాడో చూసి వానికా చెప్పులివ్వమన్నారన్నాడు . ఆశ్చర్యముతో కుర్రవానివద్దకెళ్లి తాను హరియను వాని కొడుకునని మరియు తనుధరించిన కొత్త జరీపాగా చూపించి చెప్పులపొందాడు . పరీక్షింపవచ్చిన వానికే పరీక్షబెట్టి వానిలో విశ్వాసం పెంపొందించారు సాయి, కాని ఏమాత్రం వానిపై కోపగించుకోలేదు . భక్తివిశ్వాసాలతో వెనుదిరిగాడు కానోబా . సోమదేవస్వామి యనుసన్యాసి...

శ్రీసాయిసందేశామృతము 48 (Nectar of Sri Sai's message 48)

Image
శ్రీసాయినాథాయనమః ! అధ్యాయము 48. సాయిబాబా శ్రీహరివలె భక్తవత్సలుడు . ఇరువురు తమభక్తులకు అన్యాయం జరిగితే సహింపలేని కరుణామయులు . ఈఅధ్యాయంలో ఈవిషయం మిగుల స్పష్టంగా తెలియగలదు. షేవడే యనువాడు అక్కల్కోటలో న్యాయశాస్త్ర విద్యార్థి, సాయిని నమ్మినవాడు . బాబా దయతో పరీక్షలో తప్పక విజయంపొందగలనని విశ్వసించాడు . కాని వానినమ్మకాన్ని, సాయిని అవహేళనజేసాడు తోటి విద్యార్థి సపత్నేకర్ . ఇదే అతనుజేసిన అనాలోచిత అపచారం . పదేండ్లపాటు అక్కల్కోటలో న్యాయవాదిగా కొనసాగినపిమ్మట యాతని భార్యాపుత్రులిరువురు మరణింప మిగుల వికలమనస్కుడయ్యాడు . వేదాంతం చదివినా పుణ్యస్థలాల దర్శించినా వాని అశాంతి తొలగలేదు . ఆసమయాన పూర్వ మిత్రుడు షేవడే, బాబాపై వాని విశ్వాసం గుర్తుకొచ్చి తన సోదరునితో కూడి సాయిని దర్శింప, బాబా మిగుల కోపించి వానిని తిరస్కరించారు . సంవత్సరకాలం అశాంతికి లోనై కాశివెళ్లదలచిన సమయాన వానిభార్యకు బాబా స్వప్నదర్శనమివ్వ, కలను శుభసూచకంగా తలచి మారిన మనసుతో వారిరువురు సాయిని దర్శించారు . మిగులభక్తిశ్రధ్ధలతో సాయిని సేవించిన పిదప విచిత్రంగా భార్య ఒంటినొప్పులు మాయమయ్యాయి . ముందు తృణీకరించినా ఆపై సపత్నేకర్ పై కరుణజూపి ఆశీర్వద...

శ్రీసాయిసందేశామృతము 47 (Nectar of Sri Sai's message 47)

Image
శ్రీసాయినాథాయనమః ! శ్రీసాయిసందేశామృతము Chapter 47. హత్య, ఋణము,శతృత్వము లకు తప్పక బదులుంటుందనేవారు సాయిబాబా. ఈవిషయాలన్ని వివరించుటకే బాబా ఈ అధ్యాయ కథనెంచుకొన్నారుసాయి . ఈ కథయందు ముఖ్యముగా నలుగురు పాత్రధారులు . వీరందరూ మూడుజన్మలెత్తారు . వారిజన్మలన్నింటికీ సాక్షి సాయి . మొదటిజన్మలో ధనికుడు,వాని భార్య , పేదరాలు దుబ్కీ. పురాతన శివాలయాన్ని బాగుచేయుటకై గ్రామస్తులిచ్చిన డబ్బును సరిగా వినియోగించలేదు పిసినారి ధనవంతుడు . భార్య నగలను అతి తక్కువధరకు కొని బదులుగా పేదరాలు దుబ్కీ నుండి తక్కువ వెలకు పొందిన పనికిరాని బంజరునేలను భార్యకిచ్చాడు . ఆనేల ఆలయపూజారి ఆధీనంలోకి వచ్చింది . ఈవిధంగా ధనికుడు దైవాన్ని , భార్యను , దుబ్కీని మోసంచేశాడు . కాలగమనంలో తుఫానుసంభవించి లోభి వాని భార్య దుర్మరణంపాలయ్యారు . దుబ్కీ కాలగతిచెందినది. మరుజన్మలో ధనికుడు పేదబ్రాహ్మణుడు వీరభద్రప్పగను, వాని భార్య పూజారికూతురు గౌరిగాను, దుబ్కీ గౌరవనింటిలో చెన్నబసప్పగను జన్మలెత్తారు . పూర్వజన్మ ఋణానుబంధమీజన్మలో వారినేకం జేసింది . బాబాసమ్మతితో వీరభద్రప్ప గౌరీల వివాహం జరిగింది . కాని భద్రప్ప పూర్వజన్మవాసనలు కొనసాగాయి , ధనవ్యామోహమేమాత్రం ...

శ్రీసాయిసందేశామృతము 46 (Nectar of Sri Sai's message 46)

Image
శ్రీసాయినాథాయనమః ! భక్తిశ్రధ్ధలున్నభక్తులకు సాయిబాబా నిత్యసత్యులు. సమాధికుముందువలె ఇప్పటికి సాయిలీలలప్రవాహం కొనసాగుతూనేవుంది. తమకు తమ చిత్రపటానికి తేడాలేదన్న వాక్యానికి మరోనిదర్శనం ఈ అధ్యాయవిషయం. ప్రియభక్తులు కాకాసాహెబు దీక్షితు, నానాసాహెబ్ చాందోర్కర్ నాగపూర్ మరియి గ్వాలియర్ లలో తమతమగృహములాజరుగు శుభకార్యములకు సాయినాహ్వానింప, తమకుబదులు శ్యామాను పంపెదమని, వారికంటెముందుగానే గయ జేరేదమన్నారు. శ్యామా అప్పాకోతేయనువానితో పై శుభకార్యములకు హాజరై పిదప కాశీ, ప్రయాగ అయోధ్యల యాత్రముగించి గయజేరి యచట పాండా యింట అతిధులయ్యారు . ఇచట ఆశ్చర్యకరవిషయమేమన పాండా గృహం ముందుహాలులో బాబాచిత్రపటాన్నిజూసి శ్యామా చకితుడయ్యాడు . బాబామాటలు సత్యమయ్యాయి . అంతకు 12 సంవత్సరాల పూర్వము పాండా శిరిడీ దర్శించి బాబాయనుమతితో శ్యామానుండి ఆ పటం పొందాడు . ఈసంఘటన స్మరించిన పాండా మిగుల సంతుష్టుడై శ్యామాను బహు సత్కరించాడు . చిత్రపట విశేషాలను శ్యామా పాండాలు మరచినా సాయి మరువలేదు . సాయి భూత వర్తమాన భవిష్యత్తులెరిగిన సర్వసమర్థులు, కాలాతీతులు . బాబా ప్రేమానురాగాలు కేవలం మానవమాత్రులపైనేగాక సమస్త జీవజంతువులపట్ల వ్యాపించినవి . పరస్పరద్...

శ్రీసాయిసందేశామృతము 45 (Nectar of Sri Sai's message 45)

Image
శ్రీసాయినాథాయనమః ! సమర్ధసద్గురు సాయినాథులు ఆత్మస్వరూపులు , పరమాత్మస్వరూపులు . ఆత్మ మరణరహితము, బాబా మరణరహితులు ! మహాసమాధికి ముందట సాయి దేహసంచారులు , పిదప ఆత్మసంచారులు, సర్వవ్యాపకులు . సమాధి యనంతరము వారిలీలలు యదావిధి కొనసాగటం భక్తులయనుభవ సత్యం . సాయినాథులపట్ల అపరిమిత ప్రేమయే సాధనారహస్యము. భక్తులచే సద్గ్రంథపఠనము జేయించెడివారు బాబా . సమాధియనంతరం భక్తులు పారాయణ కొనసాగిస్తున్నారు . ఒకరోజు ఉదయం బొంబాయి చౌపటిలోని కాకామహాజని యింట్లో కాకాసాహెబు దీక్షితు ఏకనాథభాగవతము చదువుచున్నాడు . ఆదిభక్తిప్రధానమైన ఘటన . అందు నవనాథులు భాగవతధర్మసూత్రాలను జనకమహారాజునకు వివరిస్తున్నారు . నాటి పారాయణసారాంశమేమన హరినామ గురునామ స్మరణలే కలియుగమోక్షసాధనలు . నాటి పారాయణానంతరము, నవనాథులు జూపిన భక్తి సామాన్యులకతిదుర్లభముగా దలచి దీక్షితు మిగుల నిరుత్సాహపడ్డాడు . బాబాలాంటి సద్గురుభక్తులు భక్తివిషయంలో సందేహించుటేలయని పక్కనున్న శ్యామా వ్యాఖ్యానించాడు . కాని దీక్షితు వ్యాకులమనసు కుదుటబడలేదు . ఆశ్చర్యంగా ఇందులకు సమాధానం మరునాడు ఆనందరావు పాఖాడే యనుభక్తుని రాకతో తీరినది . పాఖాడే తనస్వప్నవృత్తాంతం వివరించాడు . నీటమునిగిన బాబాపాదా...

శ్రీసాయిసందేశామృతము 43-44 (Nectar of Sri Sai's message 43-44)

Image
శ్రీసాయినాథాయనమః ! సాయిబాబా మహాసమాధి ఈ అధ్యాయ ముఖ్యాంశము. తమసమాధి విషయం ముందెతెలిసిన సాయి వజే యనుభక్తునిద్వారా రామవిజయమను గ్రంథమును పారాయణజేయించారు. అనాత్మపై, ఆత్మ విజయానికి ప్రతీక రామవిజయం. తమచివరి క్షణాలను దైవంపై నిలిపి సామాన్యులకు దైవచింతనవిషయంలో దారిజూపారు . ఆరోజు భోజనసమయాన అంకితభక్తులను భోజనానికి పంపి అతికొద్దిమందితో మజీదునందున్నారు బాబా. లక్ష్మీబాయి షిండేకి నవనాణెముల దానం జేసినపిమ్మట తమను బూటీవాడాకు తీసుకొనివెళ్ళవలసినదిగా జెప్పి బాయాజీ పాటీలు ఒడిలో తమ తుదిశ్వాస విడిచారు . బాబా దేహత్యాగంచే శిరిడీ ప్రజలు తల్లడిల్లారు . త్వరలో మరలవస్తారనే విశ్వాసంతో కొంత యూరడిల్లారు. బాబాసమాధి విషయమై వాదోపవాదాలు జరిగినా తుదకు మురళీధర స్థాపనకు నిర్దేశింపబడిన స్థానంలో బాబా దేహాన్ని సమాధిజేశారు . నిజంగా బాబాయే మురళీధరుడు , వాడాయే దేవాలయం . నిర్యాణానికి సంకేతమన్నటుల కొద్దిరోజుల ముందు బాబా ఆత్మప్రతీకగా తలచే ఇటుక విరిగిపోయినది . గురుప్రసాదంగా తలచే ఇటుక విరిగినపుడు సామాన్యులవలె సాయి విలపించారు . 1886 లో బాబా 72 గంటలు సమాధిపొంది మరల జీవించుట వారి అసంపూర్తి అవతారకార్యమును కొనసాగించుటకే ! బాబాలోని శాశ్విత...

శ్రీసాయిసందేశామృతము 42 (Nectar of Sri Sai's message 42)

Image
శ్రీసాయినాథాయనమః ! ఈ అధ్యాయారంభములో ఓ ముఖ్యవిషయం చెప్పబడినది , "సద్గురుని పాదములను జ్ఞప్తియుంచుకొనినచో మరణము తన నైజమును కోల్పోవును . " ఇచట మరణమనగా మరల మరల దేహమునుధరించి జన్మలెత్తక ఆత్మగా వెలిగి దైవంలో విలీనమవడం గా తలంపవచ్చును . బాబా తమసమాధి విషయం రెండు సంవత్సరాలకు ముందే సీమోల్లంఘన సమయాన సూచించినప్పటికీ భక్తులెవరూ గ్రహింపలేకపోయారు . దేహసీమను దాటి దేహాతీత ఆత్మస్థితిలో చైతన్యం ప్రకాశించడం సీమోల్లంఘనగా గ్రహింపగలము . ప్రస్తుతం బాబా అలానే తమ అవతార కార్యాన్ని కొనసాగిస్తున్నారు . పిమ్మట ఓరోజు మరణాపాయంలోనున్న రామచంద్రపాటిలుకు భౌతిక దర్శనమిచ్చి ,ఓదార్చి వాని చావు చీటీని రద్దుజేశారు కరుణామయుడు సాయి . అదేరాత్రి వానికి తాత్యాకు రాబోయే మరణవార్తజెప్పి , ఆవిషయం గోప్యంగా యుంచమన్నారు . బాబాచెప్పినటుల తాత్యా 1918 విజయదశమిరోజున జబ్బుపడి మరణాపాయంలో నున్నాడు . కాని ఇంతలో ఓవింత జరిగింది, తాత్యాప్రాణం నిలబడి బాబా దేహం చాలించారు . తాత్యా తల్లి బాయిజాబాయి సేవకు ప్రతిఫలంగా బాబా ఇలా రుణందీర్చుకొన్నారు . కృతజ్ఞతకు మారుపేరు సాయిబాబ. బాబాను సేవించిన మరొక్క పుణ్యశీలి లక్ష్మీబాయి షిండే . నిత్యం బాబాకొర...

శ్రీసాయిసందేశామృతము 41 (Nectar of Sri Sai's message 41)

Image
శ్రీసాయినాథాయనమః ! గత అధ్యాయంలో చిత్రపట రూపంలో హేమాడ్ పంత్ ఇంట బాబా విందారగించిన లీల చెప్పబడినది . ఆ చిత్రపటం పూర్వచరిత్ర నిట తెలిసికొనెదము . ఆలిమొహమ్మద్ తన ఆరోగ్యం కుదుటబడుటకై బావమరది నూర్ మొహమ్మద్ సలహాపై తనయింటనున్న యోగులపటాలను మేనేజర్ ద్వారా బాంద్రాసముద్రంలో ముంచివేయించాడు . రెండునెలలపిమ్మట తనింటికి తిరిగొచ్చిన అలీ అహమ్మద్ పూర్వమువలె తనింట గోడపై కేవలం బాబాఫోటోను గమనించి మిగుల ఆశ్చర్యపడ్డాడు . మేనేజర్ ఇతరపటాలను మాత్రమే ముంచి బాబా పటాన్నెందుకు విడిచాడో ఎవరికీ తెలియని విషయం . వానికి పటంలో బాబాదర్శనమైనదేమో ఎవరికెరుక ? మరొక్క గమనింపదగిన విషయమేమన హేమాద్రిపంతు చిత్రపటం పొందినరోజు ఉదయమే బాబా వానింటికి భోజనానికి వస్తామని స్వప్నంలో చెప్పారు . చెప్పినటుల భోజనసమయానికి పటం రూపంలో వచ్చి విందారగించి తమకు తమ చిత్రానికి తేడాలేదనే విషయాన్ని మరొక్కసారి భక్తులకు అనుభవాన్ని కలిగించారు . కావున భక్తులెల్లరు తమఇంట ఫొటోలో బాబాయున్నారనే ఎరుక మరువరాదు . ఈ అధ్యాయంలోని మరొక్క విషయమేమన బీవీ దేవు గారు బాబా ఆశీసులతో జ్ఞానేశ్వరిని చదువ మనసులో దలచాడేగాని, స్వయంగా బాబా సాయం అడుగలేదు . ఈవిషయమై వేరొక భక్తు...

శ్రీసాయిసందేశామృతము 40 (Nectar of Sri Sai's message 40)

Image
శ్రీసాయినాథాయనమః ! ఈ అధ్యాయంలో రెండు సాయిబాబా చిత్రవిచిత్ర లీలలు చెప్పబడినవి . బీ.వీ దేవుగారు తమఇంట ఉద్యాపనకు బాబాను రావలయునని లేఖవ్రాసినపుడు మరిద్దరితో వచ్చెదనని జోగుద్వారా జవాబు పంపారు . చెప్పినట్లు ఉద్యాపన రోజున మరిద్దరితో సన్యాసివేషంలో సమయానికివచ్చి భోంచేసి వెళ్లారు . కాని దేవ్ గుర్తింపలేకపొయాడు. కారణం అదేసన్యాసి నెలరోజులముందు చందాలసేకరణ నెపంతో రైల్వే స్టేషన్లో దేవుని కలిసాడు . బాబామాటతప్పారని నిష్టురంగా దేవు లేఖరాస్తే , అదిచదవకముందే ఆవిషయాన్ని జోగుకువివరించారు సాయి . మరొక సాయిస్వప్నసందేశ లీల . హోళీ పండుగనాడు హేమాడపంతుకు కలలోకనబడి ఆరోజు వారింటికి భోజనానికి వస్తామన్నారు . సరిగా భోజనవేళకు వారింటికి చిత్రపటంలో ప్రత్యక్షమయ్యారు . పండుగ వంటలతో చిత్రపటానికి నైవేద్యం అర్పించారు. బాబాత్రుప్తిగా భోంచేసారు . భక్తులు తమయిండ్లలో నైవేద్యంమరచినా బాబాకెరుకే యను లీల వేరొక అధ్యాయంలో చెప్పబడినది . కావున బాబాపూజను భక్తిశ్రద్ధతలో చేయాలిగాని అశ్రద్ధ పనికిరాదు , సాయి సర్వజ్ఞత , సమర్ధత, భక్తవాత్సల్యం ఈలీలలరూపంలో భక్తులు తెలియగలరు . సాయిమనచర్యల సదా గమనిస్తున్నారనే యెరుకతో ప్రవర్తించాలి . సాయి ఏరూప...

శ్రీసాయిసందేశామృతము 39 (Nectar of Sri Sai's message 39)

Image
శ్రీసాయినాథాయనమః ! ఈ అధ్యాయంలో బాబాయొక్క సంస్కృత భాషాజ్ఞానము , భగవద్గీతలోని ఓ శ్లోకానికి సాయిజెప్పిన వ్యాఖ్యానము వివరింపబడ్డాయి . భాషకు మూలము ఆలోచన, ఆలోచనకు మూలము భావము , భావానికి మూలము ఆత్మచైతన్యస్థితి . ఆ ఆత్మజ్ఞానికి అన్నిభాషలు , అందరి అంతరంగాలు కరతలామలకములు. సాయికి బల్లులభాషకూడా తెలియును . ఈవిషయం సచ్చరిత్ర 15వ అధ్యాయంలో వివరింపబడినది . నానాసాహెబ్ చాందోర్కర్ బాబాను ఎంతోకాలంగా సేవిస్తున్నా, బాబాశక్తిసామర్ధ్యాల నెరుగకుండెను . తనకున్న సంస్కృతజ్ఞానం బాబాకులేదనే చిన్నఅహంకార భావం. ఆతడు ఓరోజు బాబాసేవలో గీతాశ్లోకమొకటి (4:34) వల్లెవేస్తున్నాడు . బాబా గట్టిగాచదివి ఆశ్లోకార్థమును వివరింపమన నానా ఇలావివరించాడు." గురునికి సాష్టాంగనమస్కారము జేయుట, ప్రశ్నించుట సేవించుటద్వారా తెలిసికొనుము . అప్పుడు మోక్షస్థితినొందిన జ్ఞానులు బ్రహ్మజ్ఞానమునుపదేశింతురు." పిమ్మట బాబా ఆశ్లోక విశేషార్ధమును తెలుపమన నానా తడబడి తనజ్ఞానపరిధిలో శ్లోకానికి వివరణిచ్చాడు, ఆపై వాని వాక్కు మూగవోయింది . " జ్ఞానము నెవరైనా బోధింపగలరా , అజ్ఞానమును తొలగించుటయే జ్ఞానముగాదా ?" యన్నబాబా ప్రశ్నకు నానా మౌనం వహించాడ...

శ్రీసాయిసందేశామృతము 38 (Nectar of Sri Sai's message 38)

Image
శ్రీసాయినాథాయనమః ! దైవాన్ని ఓ ప్రత్యేకరూపంలేని విశాల జలాశయంగా తలిస్తే అదే నిరాకారరూపమవుతుంది . పాత్రలోని ఘనీభవించిన నీరు పాత్ర ఆకృతి ధరించినవిధంగా రూపుదాల్చిన దైవం, ఆ దివ్యాకృతియే సాయిమానుషరూపం . కాని తనను బానిసలకు బానిసగా పేర్కొన్న నిరహంకారరూపమే సాయినాథులు . బాబాజేసిన అన్నదాన ప్రక్రియ వారి కర్మయోగానికి ప్రతీక . స్వయంగా తామే వంటదినుసులసేకరించి శాకాహార మాంసాహారాలను వండి వండిచెడి వారు . మరుగుచున్న దేకిసాలో చేతిని గారిటిగా తిప్పెడివారు . కాని చేయి ఏమాత్రము కాలెడిదికాదు. దేహాతీత యోగస్వరూపులు బాబా . మత్స్యమాంసముల భుజించినప్పటికీ హిందూ దేవీదేవతల మిగుల గౌరవించెడివారు సాయి . శిరిడీవచ్చు దారిలో దత్తదర్శనం చేయని నానాసాహెబ్ చాందోర్కరును మందలించారు సర్వజ్ఞులు సాయి . హిందూ ముస్లిం ఆచార్య వ్యవహారాల సమంగా పాటిస్తూ మతసామరస్యానికి సారధిగా మరియు వారధిగా వ్యవహరించారు . మహిమాన్వితసాయి సాధారణ మనుషులతో కలిసి భుజించెడివారు . ఉపవాసాలనిరసించే సాయి అందరికిభోజనంపెట్టి తృప్తిచెందేవారు . వారిబోధ ఆచరణాత్మకము . అన్నాసాహెబ్ కు గిన్నెడు మజ్జిగ ప్రసాదంగా యిచ్చి వానిచే అమృతసమాన లీలలగ్రంధాన్ని వ్రాయించారు . బాబా ప...

శ్రీసాయిసందేశామృతము 37 (Nectar of Sri Sai's message 37)

Image
శ్రీసాయినాథాయనమః ! శ్రీసాయిసచ్చరిత్ర నిత్యపారాయణముచే నిరంతరము సాయి చర్యలను బోధలను వారిజీవన విధానమును అనుక్షణము స్మరించెదము . అదియే సాయితో నిత్యసాంగత్యము . సాంగత్యబలంచే వ్యక్తి ప్రవర్తనలో తెలియకనే మార్పు వస్తుంది, అలానే సాయిపథంలో పయనం మొదలవుతుంది . బాబా మొదట్లో ఒకనాడు మజీదులోను మరునాడు చావడిలోను నిదురించెడివారు . 1910 డిసెంబరు 10 నుండి చావడిలో పుజారతులు మొదలెట్టారు . ఆ చావడి వేడుక మహత్తర యుత్సవం. భజనబృందాలు , రధము, తులసీబృందావనము,దివిటీలు , అలంకరింపబడిన పల్లకి , గుఱ్ఱము శ్యామకర్ణ బాబావెంట నడిచేవి . భక్తుల జయజయకారాలు మిన్నుముట్టేవి. శ్రీపురుషుల భజనధ్వనులు మిన్నంటేవి . దీక్షియు బాబాపై పువ్వులు గులాల్ చల్లుచుండెడివాడు . బాబాముఖతేజస్సు ద్విగుణీకృతమయ్యెడిది . మాల్సాపతి తన్మయుడై నాట్యంజేసేవాడు . పిమ్మట ఆశోభాయాత్ర అలంకరింపబడిన చావడిజేరెడిది. అచట భక్తులు తనివితీరా అలంకరించి శ్రద్ధాభక్తులతో బాబాను పూజించెడివారు . వారిభక్తికి దాసుడైన బాబా వారిచర్యలకు అడ్డుచెప్పెడివారుకాదు. భక్తులతోకలసి చిలుము తాగెడివారు . భక్తులపై వాత్సల్యమటువంటిది. బాపు సాహెబ్ జోగ్ ఆరతితో నాటి కార్యక్రమం ముగిసేది . ఆరోజులు గడి...

శ్రీసాయిసందేశామృతము 36 (Nectar of Sri Sai's message 36)

Image
శ్రీసాయినాథాయనమః ! ఈఅధ్యాయంలో ఇద్దరి గోవపెద్దల అనుభవాలు చెప్పబడ్డాయి . వారిరువురు బాబాను దర్శించినప్పుడు , సాయి కేవలం ఒకరినుండి అడిగి 15 రూపాయలు దక్షిణ స్వీకరించారేగాని మరొకరు 35 రూపాయలు స్వయంగా సమర్పించినా స్వీకరింపలేదు . సమీపమునున్న శ్యామా అదేమి న్యాయమని ప్రశ్నింప సర్వజ్ఞుడగు బాబా ఆపెద్దల పూర్వ విషయాలను పూసగుచ్చినట్లు వివరించారు . మొదటివ్యక్తి దత్తభక్తుడు . తనకు ఉద్యోగం లభిస్తే మొదటినెల జీతమిచ్చెదనని తనదైవానికి మొక్కుకున్నాడు . 15 రూపాయల ఆరంభజీతంతో మొదలై అంచెలంచెలుగా పెద్దజీతం పొందాడు . మొక్కు మరచినవానిని పిలిచి ఆమొక్కుకుసరిపడ దక్షిణ స్వీకరించి రుణముక్తునిజేసి తానె దత్తుడనెడి అనుభవాన్నికలిగించారు . రెండవవ్యక్తి యనుభవం మరోవిధంగా వుంది . ఎంతోకాలంగా విశ్వాసంతో పనిజేసిన వాని వంటమనిషి చెడుదారినపడి ఇంటిలోని 30 వేలరూపాయల దొంగిలించాడు . మిగుల దుఃఖంతో విచారగ్రస్తుడైన వానింటికి ఓ సన్యాసివచ్చి వివరములనెరిగిన పిమ్మట శిరిడీ బాబానుదర్శింపమని అప్పటివరకు తనకు ప్రియమైన ఆహారమును తినుటమానుమనిజెప్పి వెళ్ళిపోయాడు . సన్యాసిమాటలపై విశ్వాసంతో అన్నంతినుటమానిన పిమ్మట 15 రోజులలో దొంగిలించిన సొమ్మును తిరిగి...

శ్రీసాయిసందేశామృతము 35 (Nectar of Sri Sai's message 35)

Image
శ్రీసాయినాథాయనమః ! సద్గురునిపైగాని భగవంతునిపైగాని విశ్వాసం కుదరడం అంతసామాన్యవిషయంకాదు . సాధారణమానవుడు వారికి నేలనమస్కరింపవలెనని తలచిన ఇరువురు కాకామహాజని మిత్రులలో బాబా విశ్వాసమెలానింపారనేది ప్రస్తుత అధ్యాయ విషయము . దైవం నిరాకారునిగా దలచు కాకాజీ మహాజని స్నేహితుడు కేవలం వింతలేమైనా జరిగితే చూచుటకు బాబాను దర్శించాడు . దూరంనుండే తన తండ్రి కంఠస్వరంతో ఆహ్వానం పలికేసరికి మిగుల విస్మయమొందినయాతడు వెనువెంటనేలోపలికివెళ్ళి బాబా పాదాలకు నమస్కరించాడు . దక్షిణ నివ్వతలువని వానిమనసెరిగిన బాబా వానినుండి దక్షిణ కోరలేదు . పిదప మనసుమార్చుకొని దక్షిణనివ్వదలచిన యాతని ఆలోచనకనుగుణంగా వానినుండి దక్షిణపొందారు బాబా . ఇరువురిమధ్య అడ్డుగోడ తొలగించామన్నారు బాబా . సంశయ చిత్తులెల్లరకు సాయిసందేశమిది . రెండవ్యక్తి కాకాజీ మహాజని యజమాని . కేవలం కుతూహలంతో బాబాను పరీక్షింపదలచి శిరిడీకి వచ్చాడు . తనకనులముందే గింజలున్నదాక్షలను గింజలులేనివానిగా మార్చిన బాబామహిమకు మిగుల యబ్బుర పడ్డాడు యజమాని . వాని చంచలచిత్తము గ్రహించిన బాబా, ఒకేచోట విశ్వాసముంచమని బోధించారు . చపలమనసులకిది బాబా అందించిన మాత్ర! ఈసందర్భంలో బాబాచెప్పిన మరొక అమృ...

శ్రీసాయిసందేశామృతము 34 (Nectar of Sri Sai's message 34.)

Image
శ్రీసాయినాథాయనమః ! నయముకాని రాచకురుపు పీడితుడు డాక్టరు మేనల్లుడు . వ్యాధినివారణకై బాబాను దర్శించి ప్రార్ధించారు బిడ్డతో తలిదండ్రులు. " ఎవరైతే ఈమజీదుకు వచ్చెదరో వారెన్నడు ఈజన్మలో ఏవ్యాధిచేతను బాధపడరు . కురుపుపై ఊదిని పూయుము వారమురోజులలో నయమగును . " అన్నారు సాయిబాబా . బబామాటలననుసరించి ఉది రాయగా వ్యాదినెమ్మదించి కొద్దిరోజులలో పూర్తిగా నయమయ్యింది . బాబా నివాసంచే పాతమజీదు గొప్ప శక్తిస్థలంగ మారింది . నిత్యంమండే ధుని భక్తులకర్మల భస్మం జేస్తూనే ఉంది . సూర్యోదయంతో మంచుతెరలు వీడినట్లు , బాబాచూపులతో భక్తుల బాధలు, భయాలు రోగాలు దూరమయ్యాయి . వ్యాధికుదిరినా రోగి మేనమామ డాక్టరునకు బాబాపై నమ్మకం కుదురలేదు . వ్యక్తికి నమ్మకాన్నికల్గించేది బాబాయే. " ఇంకనూ నన్నునమ్మవా " అని వరుసగా ;మూడురాత్రులు స్వప్నంలో వానిని పిలుచుటచేతను, తాను చికిత్సజేయు రోగి త్వరలో కోలుకోవడంచేతను డాక్టరు బాబాను దర్శించి ప్రణమిల్లాడు డాక్టరు . మేనల్లుని రోగనివారణ మిషచే విశ్వాసంలేని డాక్టరు ఓ మంచి భక్తునిగా మారాడు. ఉదీమహిమతోపాటు బాబా శక్తియుక్తులకలయికనిచట చూడగలము . భయంకర బాధ వలన పీడితుడు డాక్టరు పిళ్లే తనబాధను...

శ్రీసాయిసందేశామృతము 33 (Nectar of Sri Sai's message 33.)

Image
శ్రీసాయినాథాయనమః ! ఈ అధ్యాయ ముఖ్యాంశము విభూతి మహిమలు . బాబా యూది దక్షిణలద్వారా భక్తులకు వివేకవిరాగ్యముల బోధించెడివారు . నాసిక్ నివాసి నారాయణ మోతీరాం తన మిత్రుడు తెలుకుట్టివిపరీతంగా బాధపడుతుంటే విభూతిలేనికారణంగా బాబాను ప్రార్ధించి అగరుబత్తి బూడిదను నొప్పియున్నచోట రాయ తక్షణమే నొప్పితగ్గినది . బాంద్రా భక్తుని కూతురి ప్లేగువ్యాధి నానాసాహెబ్, బాబాను ప్రార్ధించి రోడ్దుమీద మట్టిని తనభార్యనుదుటిపై అద్దినవెంటనే తగ్గిపోయినది . బాబాకు వారి ఫోటోకి తేడాలేదనే సందేశాన్ని బాలబువా అనుభవంద్వారా అందించారు . బాబా ఏరూపంలోనైనా భక్తుని కనుభవమీయగలరు. అప్పాసాహెబ్ కులకర్ణి గృహానికి ఫకీరువేషంలో వచ్చి దక్షిణస్వీకరించి విభూతిని ప్రసాదంగా అందించారు . మహాసమాధి యనంతరం బాబాలీలలు కొనసాగుతున్నాయనే నిజం భక్తుడు నారాయణరావు వ్యాధినివారణద్వారా వెల్లడవుతుంది . స్వప్నంలో వానినాశీర్వదించినపిమ్మట వాని జబ్బు తగ్గిపోయినది . సమాధినుండే సమాధానమన్న బాబామాట రుజువయ్యింది . యోగులు పరస్పర ఏకాత్మభావనతో పనిజేస్తారనే భావన హరిభావ్ కార్నిక్ యనుభవం నిరూపిస్తుంది . బాబాకివ్వదలచిన ఒకరూపాయి దక్షిణను నాసిక్ లోని నరసింగమహరాజ్ స్వీకరి...

శ్రీసాయిసందేశామృతము 32 (Nectar of Sri Sai's message 32.)

Image
శ్రీసాయినాథాయనమః ! అధ్యాయారంభమున రచయిత హేమాద్రిపంత్ సంసారాన్ని తలకిందుల అశ్వత్థవృక్షంతో పోల్చాడు , వేళ్ళు పైన కొమ్మలు క్రిందుగా వ్యాపించాయి . చెట్టుకు మూలం వేళ్ళు, వేళ్ళు గ్రహించిన పోషకాలతో చెట్టుపెరిగినట్లు, పూర్వజన్మ వాసనలచే చెట్టులాంటి కొత్తజన్మ ఆరంభమవుతుంది . ఊర్ధ్వలోకాలనున్న సూక్ష్మదేహాంనంటియున్న కర్మఫలాలు నూతనజన్మకు పోషకాలుగా తలచవచ్చును . సూక్షదేహాలు ఊర్ధ్వలోకాల్లో సంచరిస్తాయికనుక వేళ్ళు పైనున్నటులగ వర్ణింపబడినవేమో ? వివేకవైరాగ్యాలను పొదునైన కత్తితో అనిత్యమగు పూర్వకర్మఫలాలను వధింప స్వస్వరూపమైన ఆత్మ ప్రకాశమానమౌతున్నటుల తలంపవచ్చును . బాబాతనముగ్గురు మిత్రులతో దైవాన్వేషణకై అడవిలో బయలుదేరాడు . దైవాన్ని మనసు బుద్ధులతో వ్యాఖ్యానించారు . బాబాభావన ఇందులకు విరుద్ధమైనది. పనియే పరమాత్మగా తలచి విధించినకర్మల నాచరించాలని తనమాటగా చెప్పారుబాబ. భావాతీతమైన ఆత్మను కేవలం ఆత్మసాక్షాత్కారముపొందిన సద్గురుశరాణాగతిచేతనే పొందవలెనని బాబా తలచారు . పుస్తకజ్ఞానమే సూర్యరశ్మిచొరబడని అడవి . అందులకు దారినెరిగిన మార్గదర్శి సాయము తప్పకకావలెను. మిత్రులుమువ్వురు బంజారారూపంలో కలసిన గురునివిస్మరించి వాని ఆతిధ్యం...

శ్రీసాయిసందేశామృతము 31 (Nectar of Sri Sai's message 31.)

Image
శ్రీసాయినాథాయనమః ! బాబాసన్నిధి భక్తులకు పెన్నిధి ! సర్వదేవీదేవస్వరూపులుగా బాబా భక్తులకనుభవమిచ్చారు. కావున వారున్న శిరిడీ క్షేత్రము పరమపావన తీర్థము ! అదియే వైకుంఠము , కైలాసము . శిరిడీలో సాయిని సేవిస్తూ తుదిశ్వాసవిడచిన కొందరి పుణ్యాత్ముల గాథలీయధ్యాయమున పొందుపరచడమైనది . విజయానందుడు మద్రాసుప్రాంతపు సన్యాసి,మానససరోవరం వెళ్లదలచి మార్గమధ్యంలో సాయిని సందర్శించాడు . సన్యాసి భవిష్యత్తునెరిగిన బాబ వానిచే భాగవత పారాయణము చేయించారు . ఆపై కొలదిరోజులలోనే సన్యాసి తుదిశ్వాసవిడిచాడు . బాలారాం మాన్కర్ కు 12 రూపాయలిచ్చి వానిని మచ్చింద్రగడ్ కు పంపారు బాబ. అచట ధ్యానంలో భౌతికంగా ప్రత్యక్షమై సర్వవ్యాపిగా యతనికి యనుభవమిచ్చారు.మాన్కరుకు తిరుగుప్రయాణంలో పరిచయంలేని పల్లెటూరివానిరూపంలో సాయపడ్డారు . ఏరూపంలో బాబా వస్తారో భక్తులయుహకందని గుహ్యం ! తుదకు బాబా సాన్నిధ్యంలో చివరిశ్వాస వదలిన మాన్కరు జన్మ సార్ధకమైనది . తాత్యాసాహెబ్ నూల్కర్ బాబాపై మిగులవిశ్వాసం పెంపొందించుకొన్నాడు . తనకుకలిగిన యనుభవములచే తనచివరిరోజులలో శిరిడీలో నివసించి బాబాచెంతనే మరణించాడు . చివరిక్షణంలో బాబాపాదతీర్థం స్వీకరించిన వాని జన్మ ధన్యమై...

శ్రీసాయిసందేశామృతము 30 (Nectar of Sri Sai's message 30.)

Image
శ్రీసాయినాథాయనమః ! శ్రీసాయిబాబ సంకల్పములేక వారినెవ్వరు దర్శింపలేరుగ ! సాయిపిలుపుతో శిరిడీకి లాగబడిన మరోపిచ్చుక వణిలోని సప్తశృంగిదేవి పూజారి కాకాజీ వైద్య . బహుకష్టములపాలైన పూజారి దేవిని ప్రార్ధింప బాబానుదర్శింపమని స్వప్నసందేశమిచ్చినది ఆతల్లి . బాబాయన త్రయంబేశ్వరునిగా తలచి యచటకు వెళ్లి అభిషేకాదులతో పదిరోజులు శివుని పూజించాడు . కాని మునుపటివలె అశాంతి మనస్కుడై మరల ప్రార్ధింప దేవి యాతని శిరిడీసాయిని దర్శింపమని కలలో సూచించినది. దేవీదేవతలు సయితం తమభక్తులను బాబావద్దకు పంపడంద్వారా సాయి శక్తి వ్యక్తమవుతుందిచట. కాని శిరిడికేలావెళ్లాలనేదే మరోపెద్దప్రశ్న . ఈవిషయంలోనూ సాయిమహిమ వెల్లడవుతుంది . సంకల్పం కల్పించిన బాబ ప్రయాణపుఏర్పాట్లు చేయలేరా ? సప్తశృంగిదేవికి బాకీయున్న మొక్కులను స్వీకరింపమని బాబానాశ్రయించిన శ్యామామొక్కుల నంగీకరింపక వణికెళ్లవలసినదిగా నిర్బంచారు సాయి . షిరిడీవెళ్ల మిగుల యాతురతతోయున్న కాకాను శ్యామాకలవడమెంత ఆశ్చ్యర్యకరవిషయం . మొక్కులు దీర్చినయనంతరం శ్యామా కాకాతో కలసి శిరిడీ జేరాడు . బాబానుదర్శించిన పూజారి వైద్య మిగుల ప్రశాంతచిత్తుడయ్యాడు . బాబాతో ఎలాంటి సంభాషణలు, ఆశీసులులేకయే...